అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లు

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు.
ఆలయంలో జరుగుతున్న యాగగుండాల ఏర్పాటు పనులను పరిశీలించారు. యాగశాల వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కోసం జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఆరు రోజుల్లో భక్తులకు కల్పించాల్సిన దర్శనం, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లపై అధికారులతో కలిసి చర్చించినట్టు చెప్పారు.

యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ వల్ల దర్శన సమయం తక్కువగా ఉంటుందని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని వివరించారు. ఈ విషయాన్ని భక్తులు పరిగణనలోకి తీసుకుని టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 17వ తేదీ నుండి యధావిధిగా భక్తులు పూర్తి సమయం స్వామివారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు.
అంతకుముందు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆలయ ప్రధానార్చకులు, వివిధ విభాగాల అధికారులతో జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన అంకురార్పణతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఈ ఆరు రోజుల్లో ఎలాంటి సేవాటికెట్లు, ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. భక్తులను ఆయారోజుల్లో సామర్థ్యానికి అనుగుణంగా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామన్నారు.
ఆగస్టు 11వ తేదీ మొదటిరోజు దర్శనానికి సంబంధించి ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని చెప్పారు. ఆ తరువాత రోజుల్లో నిర్దేశించిన సమయానికి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్రెడ్డి, ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఇన్చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్రెడ్డి, ఎస్ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.