ॐ ఓం నమః శివాయ ॐ
మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే , సుగంధిం పుష్టి వర్ధనం|
ఉర్వారుకమివ బంధనాన్ , మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||ప్రతి పదార్ధం:--
ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;
త్రయంబకం = మూడు కన్నులు గలవాడు;
యజామహే = పూజించు చున్నాము;
సుగంధిం = సుగంధ భరితుడు;
పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ;
వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు;
ఉర్వారుకం = దోస పండు;
ఇవ = వలె;
బంధనాత్ = బంధమును తొలగించు;
మృత్యోర్ = మృత్యువు నుండి;
అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను;
ముక్షీయ = విడిపించు.
తాత్పర్యం:-- అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
ప్రాశస్త్యము:-- మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ "మహా మృత్యుంజయ మంత్రం" పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.
ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును.
సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన (18, 27 etc.) దీనిని పారాయణం చేస్తారు.